శ్రీరంగ నాథుడు కొలువైన పంచరంగ క్షేత్రాలు.. వీటి చరిత్ర తెలుసా?

Telugu BOX Office

జలం ఏ పాత్రలోకి నింపితే ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచుకోవాలనుకుంటే…. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా ఆరాధించటం తెలిసిందే. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం.

1. శ్రీరంగపట్నం
పంచరంగ క్షేత్రాల్లో మొదటిది అయిన ఈ ఆలయం కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉంది. శ్రీదేవి ,భూదేవి సహిత రంగనాథ స్వామి ఆలయానికి వేయేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని స్వామి అనుగ్రహం కోసం కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులతో పాటు టిప్పు సుల్తాన్ కూడా ప్రార్థనలు చేశాడు. కావేరి – కొల్లిదం నదుల మధ్య నెలకొని ఉన్న ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణుభగవానుని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది, స్వయంభు క్షేత్రం కూడా.


2. తిరుప్పు నగర్‌

తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి శ్రీ మహావిష్ణువు ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరకపోవడంతో చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని చెబుతారు.

3. కుంభకోణం
ఒకప్పుడు హేమ రుషి సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. దీంతో ఆమెను కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! అందుకే.. ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు. ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది.

4. మయిలదుతురై
చంద్రుని తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి అవతరించిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతోంది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని మరో కథనం. ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ‘పరిమళ పెరుమాళ్‌… వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

5. శ్రీరంగం
పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్య రంగంగా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. విభీషణుడు ప్రతిష్టించిన మూర్తి గల ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ఈ ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ జరుగుతాయని భక్తుల నమ్మకం.‘మహానది’ సినిమాలోని శ్రీరంగ రంగ నాథుని దివ్య రూపమే చూడని.. అనే పాట శ్రీరంగం గురించి చెప్పగానే గుర్తుకు వస్తుంది. నిజంగానే ఆ రంగడి వైభవం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. శ్రీరంగం ఆలయం తిరుచిరాపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్ అని పిలుస్తారు. శ్రీరంగం ఆలయాన్ని ” ఇండియన్ వాటికన్” గా కూడా పిలుస్తారు.

Share This Article
Leave a comment