Paripoornananda swami : నన్ను గెలిపిస్తే ఇంటికో రూ.లక్ష ఇస్తా

Telugu BOX Office

ఎన్నికల వేళ నేతలు అలవికాని హామీలు ఇస్తూ.. ప్రజలను మభ్య పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అర చేతిలోనే వైకుంఠం చూపించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. బడా బడా రాజకీయ పార్టీలు మాత్రమే కాక స్వతంత్రంగా బరిలో నిలిబడే అభ్యర్థులు సైతం ఇలా ఓటర్ల మీద హామీల వర్షం కురిపిస్తారు. ఇక కొన్ని చోట్ల అభ్యర్థులే తమ కోసం వ్యక్తిగతంగా ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ స్వామిజీ ఇచ్చిన హామీ.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏకంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుస్తాను అంటున్నారు సదరు స్వామిజీ.


పరిపూర్ణానంద స్వామీజీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆధ్యాత్మిక గురువుగా, శ్రీ పీఠం వ్యవస్థాపకులుగా జనాలకు ఆయన సుపరిచితుడే. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే పరిపూర్ణానంద స్వామి.. తొలిసారి 2018 తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ తరఫున హిందూపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. హిందూపురం నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ బరిలో నిలిచారు. ఎంపీ సీటు సైతం టీడీపీ నేత బీకే పార్థసారథికే దక్కింది. దీంతో అసంతృప్తికి గురైన పరిపూర్ణానంద స్వామి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పరిపూర్ణానంద స్వామీజీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పరిపూర్ణానంద స్వామీజీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో హిందు అనే పేరుతో ఉన్న నగరం హిందూపురం కావడంతో ఇక్కి నుంచే బరిలోకి దిగుతానంటూ పట్టుబట్టి పోటీలో నిలినిట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం.. హిందూపురం ఓటర్లపై హామీలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న పరిపూర్ణానంద స్వామి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి, తనను గెలిపిస్తే ప్రతి ఇంటికీ లక్ష రూపాయల లబ్ధిని కలిగిస్తామని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వ్యక్తిగతంగా తాను ఇచ్చిన హామీలతో పాటుగా ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఓట్ల కోసం రాజకీయ నేతలే కాదు స్వామీజీలు కూడా అలవికాని హామీలు ఇస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

Share This Article
Leave a comment