డ్వాక్రా మహిళలకు బలమైన వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం రెండు వినూత్న పథకాలను అమల్లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’ మరియు ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పేర్లతో కొత్త పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈ పథకాలతో మహిళలు పిల్లల చదువులకు, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా సులభంగా చేయూత పొందనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఈ రెండు పథకాలకు ఆమోదముద్ర వేశారు. గత వారం ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే మరో పది రోజుల్లో అధికారికంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఎవరికి వర్తిస్తాయి ఈ పథకాలు?
డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా సభ్యత్వం కలిగిన మహిళలు, అలాగే ఇప్పటికే తీసుకున్న అప్పులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారు ఈ పథకాల కింద అర్హులు అవుతారు. అమలు మొత్తం బయోమెట్రిక్ ఆధారంగా జరుగనుంది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి – పిల్లల చదువుకు చేయూత
ఈ పథకం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువుకు రుణ సాయం అందించబడుతుంది. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు పావలా వడ్డీ (4%)కి రుణం లభిస్తుంది. అవసరాన్ని బట్టి పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపే డబ్బులు సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ కానున్నాయి. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు వంటి ఆధారాలు సమర్పించడం తప్పనిసరి.
ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి – ఆడబిడ్డ వివాహానికి తోడ్పాటు
డ్వాక్రా సంఘంలో సభ్యురాలు అయిన మహిళ కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం అందుబాటులో ఉంటుంది. ఇదే విధంగా 4% వడ్డీకి, గరిష్ఠంగా 48 వాయిదాల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. లగ్న పత్రిక, వివాహ నిర్వహణ ఖర్చుల అంచనా పత్రాలను సమర్పించిన వెంటనే సభ్యురాలి ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.
ఏడాదికి రూ.2000 కోట్ల వ్యయం
ఈ రెండు పథకాల కింద ప్రభుత్వం ఏడాదికి రూ.2000 కోట్ల వ్యయం భరించనుంది. ఒక్కో పథకానికి రూ.1000 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో 50% మండల, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించగా, మిగిలిన 50% స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించనున్నారు.
రుణ మాఫీ సౌకర్యం కూడా
ఈ పథకాల కింద రుణ సాయం పొందిన సభ్యురాలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే, తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. ఇది పథకంలోని మరో ముఖ్యమైన అంశం.
‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాలు డ్వాక్రా మహిళలకు భరోసా కలిగించేలా రూపుదిద్దుకున్నాయి. పిల్లల చదువుకు, ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ పథకాలు గణనీయంగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ పథకాలు గ్రామీణ మహిళలకు నిజమైన అండగా నిలవనున్నాయి.
