వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు!

Telugu BOX Office

హిందువులు ఘనంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టగానే వచ్చే తొలి పండుగ ఈ గణేష్‌ చతుర్థి. ఈ వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.  ఈ వినాయక చవితికి సంబంధించి ఒక నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు అంటారు. ఒకవేళ అనుకోకుండా గణేష్‌ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే అశుభంగా భావిస్తారు కాబట్టి చంద్రుడిని చూడకూడదని చెబుతారు. దీని వెనుక పెద్ద కథే ఉంది.

ఒక రోజు భర్త రాక కోసం ఎదురు చూస్తున్న పార్వతీదేవి స్నానానికి వెళ్లే సమయంలో నలుగు పిండితో ప్రతిమను తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ బాలుడిని కాపలాగా ఉంచి స్నానానికి వెళుతుంది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని, బాలుడు అడ్డుకోవడంతో కోపంతో ఆ బాలుడి శిరస్సు ఖండిస్తాడు. ఆ ఘోరం చూసిన పార్వతీ దేవి కన్నీరు పెట్టుకోవడంతో ఏనుగు తలను ఆ బాలుడికి అతికించి “గజాననుడు” అని పేరు పెడతారు. భాద్రపద శుద్ధ చవితి నాడు పరమశివుడు గజాననుడికి విఘ్నాదిపత్యం ఇస్తాడు. ఆ రోజున భక్తులు అందరు విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉడ్రాళ్లు మొదలైన పిండి వంటలు సమర్పిస్తారు. వాటిని కడుపు నిండా తిన్న వినాయకుడు కైలాసానికి నడవడానికి ఇబ్బంది పడుతూ వెళతాడు. శివుడు తలపై ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. దీంతో విఘ్నేశ్వరుడి ఉదరం పగిలి అందులోంచి ఉండ్రాళ్లు,కుడుములు అన్ని బయటపడతాయి. వెంటనే ఆగ్రహించిన పార్వతీ దేవి నీ వల్లే నా కుమారుడు అచేతనుడయ్యాడు కాబట్టి నిన్ను చూసిన వారికి నీలాప నిందనలు పొందురుగాక అని చంద్రుడిని శపించింది.

పార్వతీ దేవి చంద్రుని శపించిన సమయంలో సప్తరుషులు యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషిపత్నులను మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం కాకుండా, మిగిలిన రుషిపత్నుల రూపాలని ధరించి తన భర్తను సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అనుకుని ఋషులు వారిని త్యజించారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లే ఋషి పత్నులు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. రుషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాప నింద కలిగిందని, పార్వతీ దేవిని శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకున్నారు. అప్పుడు పార్వతీ దేవి ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది.

భాద్రపద శుద్ద చవితి నాడు శ్రీకృష్ణుడు ఆవు పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి శమంతకమణిని అపహరించాడని అపనిందపాలయ్యాడు. అయితే ‘ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివి, విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ని చూసినా ఎలాంటి నిందలు కలుగవు’ అని శ్రీకృష్ణుడు చెబుతాడు.

Share This Article
Leave a Comment