ఈ ఆలయంలోకి వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే!

Telugu BOX Office

హిందూ మత విశ్వాసాల ప్రకారం, అనేక దేవాలయాలు రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాల్లో నిగూఢమైన, భయానక రహస్యాలు కూడా ఉన్నాయని మనకు చరిత్ర, పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ విచిత్రమైన దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి భక్తులకు నేరుగా ప్రవేశం అనేదే ఉండదు. ఆ ఆలయం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయంలో దేవుడు ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. ఈ కారణంగా ఈ ఆలయ పూజారులు దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు, నోటికి గంతలు కట్టుకుంటారు. భక్తుల కళ్లకు సైతం గంతలు కడతారు.

మిస్టరీ టెంపుల్స్‌లో ఒకటైన లాతూ మందిరం ఉత్తరాఖాండ్‌లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ ఆలయంలో లాతు దేవతను మాత్రమే పూజిస్తారు. స్థానికుల కథనం ప్రకారం, ఇక్కడి లాతు దేవతను ఉత్తరాఖాండ్‌లోని నందా దేవి మతపరమైన సోదరిగా పరిగణిస్తారు. ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూస్తే తను అంధుడు అవుతాడని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్లకు, నోటికి గంతలు కడతారు. దీని వల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

మన దేశంలోని అనేక దేవాలయాలు ఏడాది పొడవునా దాదాపు అన్ని రోజుల్లో భక్తులకు ప్రవేశానికి అనుమతిని ఇస్తాయి. అయితే ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవబడదు. కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరచుకుంటుంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అదే విధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్లు మూసి, వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు.

ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతి చండికా స్తోత్రాన్ని తరచుగా జపిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో మిస్టరీలు ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి బస్సులో దేవ దైర్శన బస్సులను ఎక్కాలి. రిషికేష్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణించాలి.

Share This Article
Leave a comment