మజ్జిగౌరమ్మ ఆలయం!

Telugu Box Office

పిలిస్తే ప‌లికే గౌర‌మ్మ‌గా, భ‌క్తుల కోరిక‌లు తీర్చే మాత‌గా వాసికెక్కిన త‌ల్లిని ద‌ర్శించ‌డానికి ఉత్త‌రాంధ్ర‌, ఒడిస్సా వాసులు రాయ‌గ‌డ‌కు పోయి అక్క‌డ కొలువైన ఆ త‌ల్లిని ద‌ర్శించి త‌రిస్తుంటారు.

ఆలయ విశేషాలు

పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్‌దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకుని పాల‌న సాగించాడు. ఆయ‌న దుర్గా మాత భ‌క్తుడుగా కూడా ఉండేవాడు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల ‘మజ్జిగరియాణి'(మధ్య గదిలో వెలసిన తల్లి)గా పేరొచ్చింది. రాయ‌గ‌డ‌లో తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడంవల్ల తెలుగువారి సంప్ర‌దాయాలు అక్క‌డ చాలా వ‌ర‌కు రాణించేవి. అయినా ఒడిస్సా సంప్ర‌దాయాలు అక్క‌డ నెల‌కొని ఉండేవి. అందుకే మ‌జ్జిగరియాణి కాస్తా మజ్జిగౌరమ్మదేవి గా మారిపోయింది అని పూర్వీకుల క‌థ‌నం.

చారిత్రిక కథనం

కళింగ చారిత్రక కథనం ప్రకారం 1538 లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్‌ని హతమార్చ‌డంతో ఆయన వీర మ‌ర‌ణంతో ఆయ‌న 108 మంది రాణులూ అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. ఆత్మార్ప‌ణ చేసే ప్రదేశం ప్రస్తుత మ‌జ్జిగౌర‌మ్మ‌ మందిరం పక్కనే ఉంది. దీన్నే ‘సతికుండంస‌ అని పిలుస్తారు. రాజు వీర‌ మరణం తరువాత అమ్మవారి ఆలనా పాలనా చూసేవారే కరవయ్యారు. కోట కూడా కూలిపోయింది. దీంతో ఆలయ వైభవం మరుగునపడిపోయింది. 1930లో బ్రిటిష్‌వారు [‘[విజయనగరం]] నుంచి రాయ్‌పూర్ వరకూ రైల్వేలైను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే, రాయగడ మజ్జిగౌరి గుడి వద్ద జంఝావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం సగంలో ఉండగానే… మొత్తం కూలిపోయింది. అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారు కలలో కనిపించి, ‘నాకు ఆలయం నిర్మిస్తేనే, వంతెన నిలబడుతుంది’ అని చెప్ప‌డంతో జంఝావతి సమీపంలో ఆలయం నిర్మించారు.

చైత్రోత్సవం

ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ అయిదు రోజుల పాటూ చైత్రోత్సవం (చైత్ర పండుగ) జరుగుతుంది. శక్తిహోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. తొలుత జరిగేది ‘అగ్నిమల్లెలు’ కార్యక్రమం. కణకణలాడే నిప్పుల పైనుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళతాడు. అనంతరం పిల్లల నుంచి వృద్ధులదాకా…వయోభేదం లేకుండా అగ్నిమల్లెల మీద నడవడం ఆనవాయితీ. ఆ తరువాత ‘ముళ్ల ఊయల’ సంబరం! ఊయల మీదున్న మొనతేలిన మేకులపై కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు పూజారి. ఆ అయిదు రోజులూ సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు, అదో పెద్ద జాతరలా భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో సాగుతుంది.

ఆచారాలు

ఆలయ సింహ ద్వారం దాటగానే నిగనిగలాడే ఇత్తడి గుర్రం ఉంటుంది. అయిదు క్వింటాళ్ల ఇత్తడితో చేసిన ఈ గుర్రం రంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహాశ్వంపై సంచరించి, పట్టణ ప్రజలను కాపాడతారని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాల్నీ, గాజుల్నీ ముడుపులు కడతారు. దీన్ని ‘ముడుపుల చెట్టు’ అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని విశ్వాసం.

‘అమ్మా.. నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తాను’ అని మొక్కుకుంటే చాలు, తానే రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవశ్యంగా చెబుతారు. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్లాలంటే పూలు, పండ్లు, పత్రి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఓ వింత ఆచారం ఉంది. రాయగడ జిల్లా ఆదివాసీ ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం. ఇదీ ఆ ప్రభావమే కావచ్చు. ఆలయం బయట ఉన్న రాయజానీ మందిరం వద్ద భక్తులు రాళ్ళపూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చాక, విధిగా రాయజానీ మందిరంలో ఒక రాయి వేస్తారు. ఏటా విజయదశమి తరువాత, ఇలా పోగైన రాళ్లను సమీపంలోని లోయలో పడేస్తారు.

రాయ‌గ‌డ‌కు వెళ్లేందుకు దారులు

రాయ‌గ‌డకు వెళ్లి మ‌జ్టి గౌర‌మ్మ‌ను ద‌ర్శించుకునేవారికి విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం , బొబ్బిలి నుంచి ట్ర‌యిన్ లేదా బ‌స్సులలో వెళ్ల‌డానికి స‌దుపాయాలున్నాయి.ఒక‌సారి వెళ్లేవారు మ‌ళ్లీ మళ్లీ వెడుతునే ఉంటారు. అది అమ్మ‌వారి యాత్రలో మ‌ర్మం అని చెబుతారు.

Share This Article