ఉత్తర దిక్కున తల పెట్టుకుని ఎందుకు నిద్రపోకూడదు?

Telugu Box Office

ఉత్తర, పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ కాలం పిల్లలు ఆ దిక్కున ఎందుకు నిద్రపోకూడదని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. ఈ విషయానికి పురాణాల ఆధారంగా సంపూర్ణ వివరణ తెలుసుకుందాం…

రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పు దిశగా ఉంచాలి. లేనిచో దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు. ఇదే విషయం మన పురాణాల్లోనూ ప్రస్తావించబడింది. తూర్పు దిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణంలో చెప్పబడింది.

భూమి ఒక పెద్ద అయస్కాంతం. మామూలు అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వాన్న అండాండమని.. మన శరీరాన్ని పిండాండమని పిలుస్తారు. విశ్వంలోని అన్నింటి ప్రభావం, శక్తి మన శరీరంలో కూడా ఉంది.. అందుకనే ఈ రెండింటి మధ్య “లయ” తప్పకుండా కాపాడగలిగే శక్తి ఉంటే చాలా మానసిక రుగ్మతులకు పరిష్కారం దొరుకును. ఉత్తర దిక్కుకు ఆకర్షణ (అయస్కాంత) శక్తి ఉంది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినా దాని ముల్లు ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన ప్రభావం చూపిస్తుంది. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేయగల శక్తి ఉందని, దక్షిణ ధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో పేర్కొనబడింది.

మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం. శరీరానికి కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జిస్తూ ఉంటుంది. వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం.. బ్రహ్మాండం. అనగా శిరస్సు నందలి పైభాగం, దీనినే పుణికి అని, బ్రహ్మ కపాలం అని అంటారు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు విసర్జనకు కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడుతుంది. దాదాపు 1300 గ్రాముల బరువుగల మానవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని ” వెక్టార్ ” ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయువృద్ధిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస, నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.

ఉత్తర దిక్కునందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరంలోని విద్యుత్ శక్తి కొంత కోల్పోవును. ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని, వర్ఛస్సును కోల్పోతుంది. విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును, వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం, బాధ, అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీర భాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం, తిమ్మిరి, నడుమునొప్పి మొదలగు వ్యాధులు వస్తాయి. నరాలకు సంబంధించిన వ్యాధులు సైతం దాడి చేసే అవకాశముంది.

Share This Article