చెక్కు చెదరని రికార్డు… ‘లవకుశ’ని కొట్టే సినిమా మళ్లీ రాలేదు

Telugu BOX Office

ఒకప్పుడు తెలుగు సినిమా స్వర్ణయుగం. జీవితాలను పణంగా పెట్టి చిత్రాలను నిర్మించేవారు. కోట్ల కొద్దీ డబ్బుల ఖర్చుపెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవారు. ఆ సినిమాలకు ఎంత ఖర్చుపెడుతున్నారో.. అంతే స్థాయిలో నటులు సినిమాల కోసం కుటుంబాలను వదులుకొని పనులు చేసేవారు. అలా చేస్తేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యేవి. ఆ కాలంలో జనాలను ఆకర్షించేందుకు సినీనటులు పడ్డ కష్టం అంతా ఇంతాకాదు. అలాంటి కష్టానికి ఓ సినిమా రికార్డులు సృష్టించింది. 100 కాదు.. 200 కాదు.. ఏకంగా 500 రోజులు నడిచింది. మరి ఆ సినిమా ఏదో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ఇప్పటికీ పడిచస్తుంటారు చాలామంది. నవరస నటనా సార్వభౌముడిగా.. వెండితెర రాముడు, కృష్ణుడిగా ఆయన చూపించిన అభినయం ఎప్పటికీ మరువలేం. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించేవారు. ఒక దశలో రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పిన ఎన్టీఆర్ ను కొందరు అభిమానులు దేవుడిగా భావిస్తారు. ఆ శ్రీరాముడే మళ్లీ పుట్టి ఎన్టీఆర్ రూపంలో కనిపించాడని అంటారు. అంతలా ఆకట్టుకున్న ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు తీసి వినోదాన్ని పంచాడు. ఆయన తీసిన జానపద చిత్రాలన్నీ దాదాపు విజయవంతంగా నడిచాయి.

అప్పటికే రాముడిగా, శ్రీకృష్ణుడిగా అలరించిన ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో లవకుశ సినిమా ఎవర్ గ్రీన్ గా ఉండిపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ లు, పద్యాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. సీత పాత్రలో అంజలీ దేవి నటించారు. లవకుశలుగా ఇద్దరు బాల నటులు చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజై ఆకట్టుకుంది. ఆరోజుల్లో ఈ సినిమా పెద్ద సంచలనంగా మారింది. 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ను చూసేందుకు ఎడ్లబండ్లపై థియేటర్లకు వేళ్లేవాళ్లట.

లవకుశ సృష్టించిన రికార్డు ఇప్పటీకీ ఏ సినిమా బద్దలు కొట్టలేదు. ఈ సినిమా ఏకంగా 500 రోజులు ప్రదర్శింపబడింది. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి 245 రోజులు నడిచింది. ఆ తరువాత ఆ రికార్డును ఎన్టీఆరే లవకుశతో బ్రేక్ చేశాడు. ఆ రోజుల్లో ఇన్ని రోజులు నడిచి రూ.కోటి రూపాయల వరకు వసూళ్లు తెచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ లవకుశ రికార్డు రాసింది. అక్కడ ఏకంగా 40 వారాలు ప్రదర్శించారు. హిందీలో 25 వారాలు నడవడంతో అన్నగారు ఆ కాలంలోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లారెడ్డి శంకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన లవకుశ సినిమా తొలి తెలుగు కలర్ సినిమా కావడం విశేషం. ఇందులో లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రుఘ్నుడిగా శోభన్ బాబు, లవుడుగా నాగబాబు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. ఆ తర్వాత చాలా సినిమాలు 500 రోజులు 1000 రోజుల పోస్టర్లు వేసుకున్నా.. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా ‘లవకుశ’ రికార్డు ఇప్పటికే ఎప్పటికీ చెక్కుచెదరదు.

Share This Article
Leave a comment