సినిమా చెట్టు… దీని కింద 300లకు పైగా సినిమాల షూటింగ్

Telugu BOX Office

సినిమా రంగంలో సెంటిమెంట్‌‌కు ప్రాధాన్యత ఎక్కువ. ముహూర్తం షాట్ నుంచి సినిమా పూర్తి అయ్యేవరకు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు నిర్మాతలు, దర్శకులు. హీరో వేసుకోవాల్సిన షర్టు రంగు, షూటింగ్ చేయాల్సిన ఏరియాల విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. ఇలాగే సినిమావాళ్లకు ఓ చెట్టు సెంటిమెంట్‌గా మారింది. పల్లెటూరి నేపథ్యమున్న సినిమాల్లో ఈ చెట్టు కనిపిస్తే కచ్చితంగా హిట్టేనని వారికి నమ్మకం. అందుకే అత్యధిక సినిమాల్లో కనిపించిన చెట్టుగా ఇది రికార్డు నెలకొల్పింది. 300కు పైగా సినిమాల్లో కనిపించిన చెట్టు గురించి ఇప్పుడు చెప్పుకుందాం…

సినిమా వాళ్ళకి ఉన్న సెంటిమెంట్లలో గోదావరి ఒకటి. గోదావరి తీరంలో సినిమా తీస్తే కచ్చితంగా హిట్ అవుతుందనేది వారికి బాగా నమ్మకం. సహజత్వం, ప్రకృతి రమణీయత గోదావరి ప్రత్యేకత. ఒక్క తెలుగే కాదు హిందీ సినిమాలు సైతం గోదావరి తీరంలో షూటింగ్ చేసి హిట్స్ కొట్టాయి. గోదావరి తో పాటు గోదావరి గట్టునే ఉండే చెట్టు అంటే కూడా సినిమావాళ్ళకి మరో సెంటిమెంట్. ఆ చెట్టు కింద ఏకంగా 300 సినిమాల షూటింగ్ జరిగిందంటే మీరు నమ్ముతారా. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఆ చెట్టు ప్రత్యేకత అలాంటిది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో కుమారదేవం గ్రామంలో ఉంది ఈ నిద్రగన్నేరు చెట్టు. ఈ గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది. గట్టుకు ఆనుకుని పెరిగింది ఈ సినిమా చెట్టు. దీని కొమ్మలు గోదావరిలోకి పెరిగి ఉంటాయి. వాటికి ఊయల కట్టి ఊగుతుంటే కింద గల గల పారే గోదావరి, చుట్టూ ప్రశాంత వాతావరణం తన్మయత్వంతో శరీరం పులకించి పోతుంటుంది. సమీపంలోనే ఒక కొబ్బరి, మామిటి చెట్లు ఉంటాయి. చెట్టు కింద సినిమా తీస్తే, ఆ సినిమా హిట్ అని చాలా మంది సినిమా వాళ్లు నమ్ముతారు. నమ్మకమే కాదు, ఇది చాలా సినిమాల్లో ప్రూవ్ కూడా అయింది. అందుకే అదే సెంటిమెంట్ తో ఈ చెట్టు కింద ఏకంగా 300కి పైగా సినిమాలు తీశారు.

సినిమావాళ్ళకి ఈ చెట్టు సెంటిమెంట్ ఎంతగా ఉందంటే మొత్తం సినిమాలో ఒక్క షాట్ అయినా ఈ చెట్టుకింద పెడితే, లేదా చెట్టుపై ఒక్క షాట్ తీసినా ఆ సినిమా హిట్ అనేంత వరకు సెంటిమెంట్ పెంచుకున్నారు. మొదటిసారిగా 1964లో మూగమనసులు సినిమాలోని ఒక పాటని ఇక్కడ చిత్రీకరించడంతో అప్పటి నుంచి దీని ప్రాభవం పెరిగింది. 1975 లో కృష్ణ నటించిన ‘పాడిపంటలు’ సినిమా నుంచి రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ వరకు ఈ సినిమా చెట్టు కింద షూటింగ్స్‌ జరిగాయి.

ప్రముఖ దర్శకుడు పసలపూడి వంశీకి ఇక గోదావరి అంటే ప్రాణం. గోదావరి తీరంలో ఉన్న సినిమా చెట్టు ఆయనకు మహా ఇష్టం. ఈ చెట్టు గురించి ఆయన ప్రత్యేకంగా తన డైరీలో రాసుకున్నారట. గోదావరిని వంశీ చూసే కెమెరా కళ్లు భిన్నంగా ఉంటాయి. గోదావరి లొకేషన్స్, ఇక్కడ ప్రజల యాస, జీవనశైలిని ఆయన ప్రత్యేకంగా చూపిస్తారు. ఇలా మరే తెలుగు సినీ దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోదావరి – వంశీ అంతగా ఒకరితో మరొకరు ఊసులు ఆడుకుంటారు. అంతగా గోదావరి అణువు అణువునూ అర్ధం చేసుకున్నారు వంశీ. అందుకే ఆయన తీసిన సినిమాలు ఈ చెట్టు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికి ఆయన అటుగా వెళ్తే ఆ చెట్టుకింద కూర్చుని అక్కడ ఉన్న మిత్రులతో కలిసి భోజనం చేస్తారని స్ధానికులు చెబుతుంటారు.

ఈ చెట్టుని ఎప్పుడో 150 ఏళ్ల క్రితం సింగలూరి తాతబ్బాయి అనే వ్యక్తి నాటినట్లు స్ధానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ చెట్టుని కుమారదేవం ప్రజలు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే గోదావరి వరదలు వచ్చినపుడల్లా గట్టు కోతకు గురవుతుంటుంది. ఆ కోత ఈ చెట్టుకు ముప్పుగా మారింది. అందుకే ఈ సారి మీరు అలా పోలవరం వెళ్లేపుడు ఓసారి ఈ చెట్టు దగ్గర ఆగి గోదావరి ఒడిలో కాస్త సేద తీరటం మాత్రం మర్చిపోకండి.

Share This Article
Leave a comment