చిరంజీవితో విభేదాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

Telugu Box Office

చిరంజీవి – అల్లు అరవింద్‌ ఒకరికొకరు ఎలా గౌరవంగా మెలుగుతారో సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయంటూ తరుచూ వార్తలొస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను వారు ఖండిస్తూనే ఉన్నా పుకార్లు మాత్రం ఆగవు. ఇదే అంశంపై అల్లు అరవింద్‌ మరోసారి స్పందించారు.

తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో ఇలాంటి మాటలు సహజం. అయితే 80ల కాలం నుంచి మేమిద్దరం ఒకరికొకరు అన్నట్లు స్నేహితులుగా ఉంటూ పైకొచ్చాం. బావబావమరుదులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఎదిగాం. మేం ఎదుగుతున్న తరుణంలో మా కుటుంబాలు పెరిగాయి. పిల్లలు వచ్చారు. వారు కూడా ఇదే వృత్తిలో స్థిరపడ్డారు. ఫిల్మ్‌ సొసైటీలో ఉన్న అవకాశాలను అందరూ పంచుకోవాలి. ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పోటీ అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇక్కడ జనాలు ఒకటి గమనించాలి. వీళ్లందరూ ఒక్కటే. ఎవరి మీద ఏ మాట పడినా అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నది జనాలకు తెలియడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల నాన్నగారి శత జయంతి ఉత్సవాలను మా కుటుంబాలన్నీ కలిసి నిర్వహించాం. సంక్రాంతి పండుగ రోజు మా నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి రోజున అందరం కలిసి చిరంజీవిగారింట్లో చేరి సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటాం. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. మేమంతా కలిసి పండగలు సెలబ్రేట్‌ చేసుకుంటున్నామని వీడియోలు తీసే మీడియా పెడతామా? పెట్టం కదా! ఎవరి కాంపిటీషన్‌తో వాళ్లు పైకి వస్తున్నారు కానీ వీరంతా ఒకటే అని జనాలు తెలుసుకోవాలి’’ అని అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చారు.

‘ఓ సన్నివేశంలో నటించడం కష్టమై 10 టేకులు తీసుకోవడం వల్ల దర్శకుడు విసుక్కున్నారని నాన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. అప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశా. ఆ సంఘటన బలంగా నాటుకుపోయింది. కొన్నాళ్ల తర్వాత బలవంతం మీద చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్‌’లో ఓ పాత్ర చేశా. దానికి చక్కని ఆదరణ లభించింది. ఆ సినిమా విడుదల తర్వాత ‘నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్‌ అవ్వచ్చు కదా’’ అని ఓ రోజు నాన్న అడిగారు. మరుసటి రోజు ఆయన దగ్గరకు వెళ్లి ‘నేను ఎప్పుడూ యజమానిగా ఉండాలనుకుంటున్నా.. కానీ, ఉద్యోగి కావాలనుకోలేదు’ అని చెప్పాను. నాన్నకు తెలిసిన మంత్రి ద్వారా స్టేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే రూ.900 జీతం. నేను వ్యాపారమే చేస్తాను కానీ ఉద్యోగం జోలికి వెళ్లనని చెప్పేశా’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.

Share This Article