రియల్ శ్రీమంతుడు.. పెమ్మసాని చంద్రశేఖర్

Telugu BOX Office

ఓ సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు. ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి అద్భుత విజయం సాధించారు. అయితే.. ఎన్ని వేల కోట్లు సంపాదించినా తన వారి కోసం, తాను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన ఆయన్ని స్వదేశానికి రప్పించింది. దీంతో రాజకీయాల్లో చేరి ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇది చదువుతుంటూ.. ఏదో సినిమా సోర్టీలా ఉంది కాదూ.. కానీ ఇది రియల్ సోర్టీ. తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రియల్ స్టోరీ ఇది.


పెమ్మసాని చంద్రశేఖర్ .. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. ఆయనకు ఒక సోదరుడు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటా లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. పుట్టింది బుర్రిపాలెంలో అయినా.. బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. చదువుల్లో చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991లో పదో తరగతి, 1993లో ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకొని ఇంత మంచి బ్యాంకు సాధించినందుకు ఆయనను ఎంతో మంది ప్రశంసించారు.

మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000లో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున జాన్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఆన్‌లైన్లో తక్కువ ధరకే అందించేవారు. చంద్రశేఖర్ చేసిన ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కింది. ఆ టైంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఇందులో నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక వ్యాపారవేత్తగా అవతరించారు.

వ్యాపారంలో దూసుకుపోతూనే చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరారు. అక్కడి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా సేవలందించారు. ఈ సమయంలో పెమ్మసాని ఫౌండేషన్‌‌ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచితవైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. వ్యాపారంలో వేల కోట్లు సంపాదించినా తాన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు.

ఈ తరుణంలో పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే.. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ అనే పేరుతో స్కూల్ ప్రారంభించారు. పెమ్మసాని అనే ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు అంటే.. చాలా ఇష్టం. ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీ చేరారు. ఆ తరువాత నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ చేరారు. ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్ఠం. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలున్నా చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. అమెరికాలో చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభినందించారు. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని టీడీపీలో చేరారు.

2014లోనే చంద్రశేఖర్ టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ 2014, 2019లో రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంత కాలం వేచి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు నరసరావుపేటఅసెంబ్లీ టిక్కెట్ వస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో చంద్రశేఖర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా టీడీపీ ఆయన్ని ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు.

రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన కుటుంబానికి రూ.5,785. 28 కోట్ల ఆస్తి ఉన్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రూ.5,598.65 కోట్ల విలువైన చరాస్తులు, రూ.186.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్ని కోట్లకు పడగలెత్తినా తమ పేరిట ఇల్లు, కారు లేవంటూ అఫిడవిట్లో రాస్తుంటారు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ తనకు ఏకంగా 5వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని ధైర్యంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అఫిడవిట్ ప్రకారం ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. ఎన్నారై, పైగా డాక్టర్ అంటే ఎంతో సౌమ్యంగా ఉంటారని అనుకుంటారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ తనలో క్లాసే కాదు మాస్ కూడా ఉందని తన ప్రసంగాలతో నిరూపిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, తాను చేసిన సామాజిక సేవలే తనను గెలిపిస్తాయని ఆయన నమ్మకంతో ఉన్నారు.

Share This Article
Leave a comment