టీడీపీ నేతలకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Telugu BOX Office

తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగి టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వైసీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని.. అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారినీ వదిలేది లేదన్నారు. ఇప్పుడు మనకు అధికారం వచ్చిందని సొంత లాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, పరిశీలకులు, ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని.. ప్రజలు నమ్మి అద్భుతమైన విజయాన్ని అందించారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు చంద్రబాబు. పొత్తులో భాగంగా 31 మంది ఇంఛార్జ్‌లకు సీట్లు ఇవ్వలేకపోయామని.. అయినా వారు ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఏకంగా 57 శాతం ఓట్లు సాధించామని.. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిచామని గుర్తు చేశారు. 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అంతేకాదు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం పనిచేవారిని నామినేటెడ్‌ పోస్టుల్లో నియమించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి వివరాల్ని సేకరిస్తున్నామన్నారు. పార్టీ నేతలు ఇచ్చే వివరాలతో పాటుగా.. ఇతర మార్గాల్లోనూ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. కచ్చితగా కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చూస్తామన్నారు.

గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని చెప్పిన చంద్రబాబు.. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించి గౌరవించామని పేర్కొన్నారు. మరో సీనియర్ బీసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుణ్ని స్పీకర్‌గా నియమించామని గుర్తు చేశారు. టీడీపీ ఎప్పుడూ బీసీలకు సముచిత స్థానం ఇస్తుందని.. కేబినెట్ కూర్పులో కూడా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. మరోవైపు వచ్చే నెల 1 నుంచి పెంచిన పింఛన్ అందజేయబోతున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వారికో హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మొత్తం మీద చంద్రబాబు ఓవైపు పాలనతో పాటుగా మరోవైపు పార్టీపైనా ఫోకస్ పెట్టడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి

Share This Article
Leave a comment