పొత్తు ‘లెక్క’ తేలింది.. బీజేపీ కోసం టీడీపీ, జనసేన త్యాగం

Telugu BOX Office

టీడీప, జనసేన, బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టీడీనీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. సోమవారం ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో… ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్‌ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు దిల్లీ నుంచి వచ్చిన భాజపా సీనియర్‌ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి, ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు.. బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి.

రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి భాజపా ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది.

దిల్లీలో హోం మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన, బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు రెండంకెల స్థానాలు కావాలని, కనీసం పది సీట్లయినా లేకపోతే ఇబ్బందవుతుందని భాజపా నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. తమకు ఏయే స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం.


25 అసెంబ్లీ స్థానాల్ని, 10 లోక్‌సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపా నాయకులు.. వాటిలో నుంచే 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ… మిత్రపక్షం భాజపా కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాల్ని వదులుకోవడానికి సిద్ధపడగా, ముందు నిర్ణయించుకున్న దానికి అదనంగా మరో అసెంబ్లీ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు తెదేపా అంగీకరించింది. ఇప్పటికే తెదేపా 94 అసెంబ్లీ, జనసేన ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. తెదేపా అభ్యర్థుల రెండో జాబితాను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజు లోక్‌సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశముంది. మొత్తం అభ్యర్థుల్ని ప్రకటిస్తుందా, మూడో జాబితా కూడా ఉంటుందా అన్న అంశంపై స్పష్టత రాలేదు.

Share This Article
Leave a comment