ఆన్లైన్ షాపింగ్ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వారు ప్రజల ఆకర్షణకు గురయ్యే ‘తక్కువ ధర ఆఫర్’ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. రూ.10 వేల విలువైన వస్తువును రూ.5 వేలకే ఇస్తామంటూ సోషల్ మీడియాలో, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. మంచి బేరం దొరికిందనుకొని ఆర్డర్ పెట్టినవారికి చివరికి ఖాతా ఖాళీ కావడమే ఫలితం.

సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు:
ఇప్పటికే నకిలీ వెబ్సైట్లు, ఫేక్ షాపింగ్ యాప్లు సృష్టించి డిస్కౌంట్ పేరుతో అనేకమందిని మోసం చేస్తున్నారు. ‘లిమిటెడ్ ఆఫర్’, ‘ఫ్లాష్ సేల్’ పేర్లతో ఖరీదైన మొబైల్లు, వాచ్లు, ల్యాప్టాప్లు వంటి వస్తువులు 50% తగ్గింపుతో ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఒకసారి మీరు వాటిని క్లిక్ చేస్తే ఫేక్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా పేమెంట్ చేసిన వెంటనే మీ డబ్బు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. చాలా సందర్భాల్లో వస్తువులు రాకపోవడమే కాకుండా, బ్యాంక్ వివరాలు హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
సైబర్ పోలీసుల హెచ్చరిక:
ఈ తరహా ప్రకటనలు ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కనిపిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ‘‘తక్కువ ధర అంటే నిజం కాదు, ఇది ఎర మాత్రమే’’ అని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు గుడ్డిగా నమ్మి ముందస్తుగా పేమెంట్ చేయకూడదని సూచించారు. ముఖ్యంగా కొత్త వెబ్సైట్లు, తెలియని నంబర్లతో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని చెప్పారు.
జాగ్రత్తలు పాటించండి:
-
తక్కువ ధరలతో వస్తువులు ఇస్తామంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దు.
-
అధికారిక ఈ-కామర్స్ వెబ్సైట్లు (Amazon, Flipkart మొదలైనవి) ద్వారానే కొనుగోలు చేయాలి.
-
ఈ-కామర్స్ కంపెనీల పేరుతో వచ్చే లింకులను నొక్కకండి.
-
ఆర్డర్ బుక్ చేసేముందు సైట్ యొక్క రివ్యూలు, రేటింగ్లు చెక్ చేయండి.
-
నిజమైన వెబ్సైట్లు ముందస్తు పేమెంట్ అడగవు.
మోసపోతే ఏం చేయాలి:
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, 1930 టోల్ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అలాగే www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. సమయానికి ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో వస్తున్నారు. అందువల్ల ‘తక్కువ ధర’ అంటే మోసం కావచ్చని గుర్తుంచుకోండి. షాపింగ్లో జాగ్రత్త, లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం ద్వారానే మన ఖాతా సురక్షితంగా ఉంటుంది.
