Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ

Telugu BOX Office
హాలీవుడ్ రేంజ్‌లో ‘కల్కి’
4.1

600 కోట్లకి పైగా బడ్జెట్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సింపుల్‌గా చెప్పాలంటే ఇదీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ ప్రేక్షుకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్.. కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం.. నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్.. అదే ‘కల్కి’. మరి ఈ సబ్జెక్ట్‌ను నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేశారు. ప్రభాస్, అమితాబ్, కమల్.. యాక్టింగ్ ఎలా ఉంది? ఆడియన్స్‌కి నాగ్ అశ్విన్ పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది? అనేది తెలుసుకుందాం.

“అశ్వత్థామ హతః కుంజరః” అనే డైలాగ్‌తో కురుక్షేత్ర యుద్ధభూమిలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి.. నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ. తనవాళ్లు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు. “రా కృష్ణ.. ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా” అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకొని “నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావ్ అశ్వత్థామ.. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావ్ కదా.. కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపం ఇస్తున్నాను.. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో.. కలియుగాంతం వరకూ నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతావ్.. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి.. అయినా సరే నీకు చావు దరిచేరదు” అంటూ అశ్వత్థామ నుదిటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు.

దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడగా… “సరే.. కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది.. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి.. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది.. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది.. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలికి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి.. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది.” అంటూ కృష్ణుడు చెబుతాడు.

కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6 వేల సంవత్సరాల తర్వాత ‘2898 ఏడీ’లో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకొని ‘కాంప్లెక్స్’ అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీమ్ యాస్కిన్. కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీమ్ ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో పురుగుల్లా చూస్తుంటారు సుప్రీమ్ సైన్యం. అయితే సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీమ్ ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీమ్ యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తుంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరమ్‌ను కలెక్ట్ చేయాలనేది సుప్రీమ్ ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ అదే కాంప్లెక్స్‌లో పనిచేసే సుమతి మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికీ తెలీకుండా మోస్తూ జాగ్రత్తపడుతుంది.

మరోవైపు ఏదైనా భౌంటీ వస్తే దానిని పూర్తి చేసి యూనిట్స్ దాచుకుంటూ ఉంటాడు హీరో భైరవ.. ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పని చేసే నిజాయతీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్‌లో సెటిలైపోవాలనేది అతడి కోరిక. దీనికి తన కారు ‘బుజ్జి’ సాయం చేస్తూ ఉంటుంది.

ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్‌ను ఎదిరించి ‘శంభల’ అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుడ్ని కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ల నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరమ్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని శంభల మనుషులు కాపాడి వాళ్ల నగరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించనంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై భౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్‌కి తీసుకురావడానికి అందరిలానే ఆశపడి భైరవ కూడా బయలుదేరతాడు.

అయితే భగవంతుడ్ని కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సంకేతం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా అతడికి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడూ సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి యూనిట్స్ సాధిద్దామన్న భైరవ కల నెరవేరిందా? సుమతిని ఎతుకెళ్లడానికి వచ్చిన భైరవ-అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుడ్ని ప్రసవించిందా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ. దాన్ని మనకి నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని.. పురాణాల్లో రాసున్న దానిపై పరిశోధన చేసి.. చాలా కష్టపడి మూడు సరికొత్త ప్రపంచాలను నాగ్ అశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంభల ఇలా మూడు మూడు రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్‌కి పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు.. వీటి గురించే చూపించారు. అక్కడక్కడా కాస్త సరదా సంభాషణలతో ఫస్టాఫ్ అలా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ.. మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్‌కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్‌ను సెకండాఫ్‌లో భారీ యాక్షన్ చూసేందుకు నాగ్ అశ్విన్ ముందే రెడీ చేశారు.

ఇక సెకండాఫ్‌లో భైరవ-అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఆడియన్స్‌కి మంచి హై ఇచ్చింది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడ్రన్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవల్లో ఉంది. ఇక క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని మరోస్థాయి ట్విస్ట్‌ను అయితే నాగ్ అశ్విన్ ఇచ్చారు.

నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్స్‌‌యే. థియేటర్లో సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎంతో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. ఇక క్లైమాక్స్‌లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు ఏకంగా ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్‌’యే ఉంటుందంటూ అందరికీ డైరెక్టర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 

ఇక నటన విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ మరోసారి ఓ అద్భుతమైన పాత్రతో అలరించారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్‌ను చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ రావడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్లతోనే ఆయన పలికించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ఎందుకంటే సరైన పాత్ర పడితే ప్రభాస్ ఎలా నటిస్తారో వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కి మళ్లీ ఆ రేంజ్‌ హై ఇచ్చే పాత్ర ఖచ్చితంగా ‘భైరవ’ అనే చెప్పాలి. ఇక క్లైమాక్స్‌లో ప్రభాస్ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అదిరింది.

ఇక ఫస్టాఫ్ చూసే సమయంలో విలన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడ్ని ఎందుకు తీసుకున్నారా అని ఆడియన్స్‌‍కి సందేహం కలుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో ఒక్క సీన్‌తో కమల్ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశారు. రాబోయే కల్కి పార్ట్స్‌లో ఈ క్యారెక్టర్ కీలకం కానుంది. ఇక శోభన, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మృణాల్, దుల్కర్, దిశా పటానీ వంటి నటీనటులు ఆయా పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు.

 

కల్కి సినిమాలో విజువల్స్‌కి మాత్రం సలాం కొట్టకుండా ఉండలేం. ఈ చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని టీమ్ ముందు నుంచి చెబుతూ వస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్‌కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్స్, ఆర్ట్ విభాగం అద్భుతంగా పని చేశాయి. ముఖ్యంగా నాలుగేళ్ల పాటు నాగ్ అశ్విన్ టీమ్ పడిన కష్టం తెరపై క్లారిటీగా కనిపించింది. సినిమాకి నెగెటివ్ ఏం లేదా అంటే ఫస్టాఫ్‌‍ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే కొంత బాగుండేది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ క్లైమాక్స్‌ చూసి థియేటర్ నుంచి బయటికొచ్చే ప్రేక్షకులకి ఇది అంత గుర్తురాదు. ఓవరాల్‌గా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌కి మళ్లీ ఆ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కల్కియే.

హాలీవుడ్ రేంజ్‌లో ‘కల్కి’
4.1
Acting 4.5 out of 5
Mucic 4 out of 5
Graphic 4 out of 5
Production 4 out of 5
Direction 4 out of 5
Share This Article
Leave a review