టార్గెట్ పూర్తిచేసిన చంద్రయాన్ -3… స్లీప్ మోడ్‌లోకి రోవర్

Telugu BOX Office

చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై పగలు పూర్తయి.. రాత్రి ముంచుకొస్తోంది. దీంతో 14 రోజుల పాటు జాబిల్లిపై రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. సూర్యుని కాంతిని ఉపయోగించుకుని పనిచేసే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. అంత గడ్డగట్టే చలికి పనిచేయకుండా పోతాయి. ఈ క్రమంలోనే వాటిని ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపనుంది. 14 రోజుల రాత్రి పూర్తయి పగలు వచ్చినపుడు మళ్లీ అవి స్లీప్ మోడ్ నుంచి బయటికి వచ్చి యాక్టివ్ కానున్నాయి.

అయితే అంత తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు ఉంటాయా లేదా అనే సందేహాలు వస్తుండగా… ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ మాత్రం.. 14 రోజుల తర్వాత పగలు వచ్చి సూర్యరశ్మి పడితే ల్యాండర్, రోవర్ పనిచేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్లీప్ మోడ్‍‌లో భాగంగా ముందుగా ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రావస్థలోకి పంపినట్లు శనివారం రాత్రి ఇస్రో ప్రకటించింది. అయితే ఇది తాత్కాలిక విరామమా.. లేక శాశ్వత నిద్రా అన్నది మరో 14 రోజుల తర్వాతే తెలుస్తుందని పేర్కొంది.

ల్యాండర్, రోవర్‌లకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసుకున్నాయని.. అందులో రోవర్‌ను ఇప్పుడు సురక్షిత ప్రాంతంలో పార్కింగ్ చేశామని ఇస్రో వెల్లడించింది. రోవర్‌లోని ఏపీఎక్స్‌ఎస్‌, లిబ్స్‌ పరికరాలను స్విచ్ఛాఫ్‌ చేశామని.. అందులోని సమాచారాన్ని ల్యాండర్‌ ద్వారా భూమికి చేరినట్లు ఇస్రో పేర్కొంది. ల్యాండర్‌, రోవర్‌లు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని గ్రహించి వాటిల్లో ఉన్న బ్యాటరీలను రీఛార్జ్ చేసుకుంటాయి. చంద్రుడిపై 14 రోజులు పగలు, మరో 14 రోజులు చీకటి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో పగలు ప్రారంభమైన సమయంలో ల్యాండర్‌ను దించారు. ఆ తర్వాత రోవర్ బయటికి వచ్చి తిరుగుతూ పరిశోధనలు చేసింది. ల్యాండర్ దిగిన శివ్‌శక్తి పాయింట్‌ వద్ద రాత్రి కావస్తుండటంతో వాటిని స్లీప్ మోడ్‌లోకి పంపించారు.

14 రోజుల రాత్రి పూర్తయిన తర్వాత సూర్యుడి కాంతి వస్తే వాటిలోని బ్యాటరీలు రీఛార్జ్ అయి మళ్లీ పనిచేసే అవకాశం ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 22 వ తేదీన శివ్‌శక్తి పాయింట్‌ వద్ద సూర్యోదయం అవుతుందని ఇస్రో తెలిపింది. ఆ సూర్యకాంతి రోవర్‌పై పడేలా దాని సోలార్ ప్యానెల్‌ను ఉంచి.. దాని రిసీవర్‌ను ఆన్‌ చేసినట్లు పేర్కొంది. అయితే చంద్రుడిపై పగలు వచ్చాక అది రీఛార్జ్ అయి పనిచేస్తే మరింత సమాచారం అందుతుందని… లేకపోతే ఇండియాకు గుర్తుగా ఎప్పటికీ జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిలిచిపోతాయని ఇస్రో వెల్లడించింది.

Share This Article
Leave a comment