నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హాజరు కానున్న అతిరథ మహారథులు

Telugu BOX Office


ఆంధ్రప్రదేశ్‌లో ‘కూటమి’ కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఎంపిక చేసిన మైదానంలో భారీ జన సందోహం నడుమ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, కొందరు కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు… అభిమాన సందోహం నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను మంగళవారం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సమావేశ మందిరంలో కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదట టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకొన్నారు. ఆ తర్వాత కూటమి తరఫున శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రతిపాదించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపర్చారు. సమావేశానికి హాజరైన మూడు పార్టీల ఎమ్మెల్యేలు హర్షధ్వానాలతో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.

ఈ భేటీ అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కలిసి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. సభా నేతగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు మూడు పార్టీల తరఫున విడివిడిగా లేఖలు సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్‌ ఒక లేఖ పంపారు. సాయంత్రం చంద్రబాబు రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వారు నేరుగా అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో కలిసి రాత్రి భోజనం తర్వాత నోవాటెల్‌ హోటల్‌కు చేరుకొని రాత్రి బస చేశారు. మంగళవారం సాయంత్రం కొంత విరామం తీసుకొని చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసి లిస్ట్ ఫైన్ చేశారు.

ప్రధాని మోదీ రాక
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం విజయవాడ రానున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తానికి కొంత ముందు ఆయన రానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఆయన భువనేశ్వర్‌ వెళ్లి ఒడిశా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని సమాచారం. కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగాలు ఏవీ ఉండవని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగం కూడా ఉండబోదని అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే ప్రాంగణంలో కొత్త మంత్రులతో అల్పాహార విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించారు.


రేపే ‘తొలి సంతకాలు’
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమా ణం చేసిన అనంతరం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల వెళతారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని, 10.45 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే ఒకటో బ్లాకులోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ… ‘డీఎస్సీ నోటిఫికేషన్‌’పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు… ఫైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత… సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతోపాటు మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశముంది.

Share This Article
Leave a comment