ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని నిలబెట్టాయి – మహేశ్‌బాబు

Telugu BOX Office

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో ఐదేళ్ల బయట ఎక్కడా కనిపించడు. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ మాట తెగ వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో రాజమౌళితో మూవీ చేయబోతున్నాడు కాబట్టి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందుకే తగ్గట్లే మహేశ్.. షూటింగ్‌కి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, రాజమౌళితో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘నన్ను ప్రభావితం చేసి నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు. ఈ సినిమాలే నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఈ మూడింటిలానే ఆడియెన్స్‌కి నచ్చేలా, నైతిక అంశాలు ఉండేలాంటి కథల్ని ఎంపిక చేసకుంటూ వస్తున్నాను. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో సినిమా సక్సెస్ కావడంపై నా ఆలోచన విధానం కూడా మారింది. ఓ మూవీ హిట్ కావడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది కూడా అంతే ముఖ్యం’

‘సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు నెగిటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఓ నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేను ఓ సినిమాని అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు లొంగిపోతా. దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతాను. ఆ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు.. ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నారు. అలానే రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు.

ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో వచ్చిన మహేశ్.. యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. కానీ సినిమా పూర్తిగా తేలిపోయింది. ఏ దశలోనూ అలరించలేకపోయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజమౌళితో మూవీపైనే గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. జంగిల్ అడ్వంచర్ స్టోరీతో తీస‍్తున్న ఈ మూవీ కోసం మహేశ్ దాదాపు మూడేళ్ల కేటాయించినట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment