గుణ‌శేఖ‌ర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంత‌లం’ మొదలైంది

Telugu Box Office

టాలీవుడ్‌లో పౌరాణిక, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ నివ్వగా, ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు శాకుంతలం అనే పాన్ ఇండియా‌ సినిమాని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ గుణ టీం వర్క్స్) కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు వంటి మేకర్ ఈ ప్రాజెక్టును వెన్నుతట్టి అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. నా లాంటి ఒక ద‌ర్శకుడికి దిల్‌రాజులాంటి మేక‌ర్ ప్రాత్సాహం ఉంటే దాని మేకింగ్, నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రథమ పుత్రిక నీలిమ గుణ ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్‌లో మాస్టర్స్ చేసింది. ఈ మూవీతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి దిల్‌రాజు ప్రోత్సాహం మ‌రింత ఆనంద‌దాయ‌కం.

 

ఇది కూడా చదవండి: రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

 

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు. శాకుంతలం సినిమాలో శకుంతలగా ఎవరు నటిస్తారని ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ సున్నితత్త్వం ఎవరికి ఉంది? అనుకుంటుండగా సినీప్రియుల నుంచి ఎక్కువగా నాకు సమంత పేరు వినిపించింది. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకునే సమంత నేను కథ చెప్పగానే ఓకే చెప్పేశారు. ఈ పాత్ర కోసం నాలుగు నెలల క్రితమే అన్ని విద్యల్లో ఆరితేరింది. క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. వ్యాపార దృష్టితోనే కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు గారు ఈ సినిమాకు ఎంత బ‌డ్జెట్ అయితే అంత‌ ఖర్చుపెట్టండి మీ వెన‌కాల నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చారు. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ గారిని కూడా నీలిమనే సెలెక్ట్ చేసింది. కథ గురించి అంతా తెలుసుకుని ఓకే చెప్పారు. సినిమాకు కావాల్సిన హార్స్ రైడింగ్‌, స్వోర్డ్‌ ఫైటింగ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు వీరిద్దరు సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు` అని చెప్పుకొచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సమంత మేనేజర్ మ‌హేంద్ర వచ్చి నాతో శాకుంతలం సినిమా గురించి చెప్పాడు. గుణ శేఖర్ మళ్లీ నిర్మాతగా ఎందుకు చేస్తున్నారు.. ఆయన వెనక ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నాను. మీరు ఉంటారా స‌ర్ అని ఆయన అన్నప్పుడు స‌రే కాని నేను క‌థ వినాలి అని చెప్పాను. ఒక్కడు సినిమా రిలీజ్ రోజు సత్యం థియేటర్లో చూశాను. అలాంటి సినిమా ఒకటి తీయాలని కలలు కన్నాను.. కానీ తీయలేకపోయాను. ఇలాంటి సినిమాలు తీయాలనే కోరిక అప్పుడే మొదలైంది. శాకుంతలం లాంటి హిస్టారికల్ సినిమాను తీయడం మామూలు విషయం కాదు. సమంత ఆల్రెడీ కథకు ఓకే చెప్పింది కాబట్టి.. గుణ శేఖర్ కథ చెప్పేటప్పుడే సమంతను శ‌కుంత‌ల‌గా ఊహించుకున్నాను. అన్నీ ఎమోషన్స్‌ బాగా కుదిరాయి. ఎమోషన్స్ పరంగా చాలా సన్నివేశాలు అదిరిపోయాయి. సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్తాను అని గుణ శేఖ‌ర్ అన్నారు. నాలుగు నెలల నుంచి దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. గుణశేఖ‌ర్ ఈ సినిమాతో త‌న కూతురిని నిర్మాతగా ప‌రిచ‌యం చేస్తున్నారు. వారి వెనుక నేనున్నాను. 2022లో ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక దుష్యంతుడిగా ఎవరు అని అనుకుంటున్న సమయంలో ఓ ఫోటో షూట్‌ చూడమని గుణ శేఖర్ రమ్మన్నారు. దేవ్ మీద చేసి ఫోటో షూట్ చూపించారు. ఆ గెట‌ప్‌లో నిజంగా కింగ్‌లాగే ఉన్నాడు. మంచి దుష్యంతుడు దొరికాడు అనుకున్నాను. గుణ శేఖర్‌కు తగ్గ టీం దొరికింది. అద్భుతమైన సినిమా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తాం’ అన్నారు.

ఇది కూడా చదవండి: దుమ్ము రేపుతున్న ‘సారంగ దరియా’ సాంగ్.. టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు

 

చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నా మొదటి సినిమా. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అల్లు అర‌వింద్‌గారికి నా ధన్యవాదాలు. స‌మంత‌, హ‌న్షిత చాలా స‌పోర్ట్ చేస్తున్నారు’ అన్నారు.

హీరో దేవ్ మోహన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఓ రాజుగా దుష్యంతుడి పాత్రలో కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. అసలు సిసలు నిర్మాత దిల్‌రాజు గారు మా వెనక ఉన్నారు. మీరు కూడా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సమంతతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడిక‌ల్‌ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్పటికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి. దిల్ రాజు గారు, గుణ శేఖర్ గారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వంద శాతం నేను చేయాల్సింది చేస్తాను. గుణ శేఖర్ గారు ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు. రిఫరెన్సెస్ అడిగితే కూడా లేదని నీలిమ చెప్పింది. అంతా దర్శకుడి మైండ్‌లోనే ఉందని అన్నారు. ఈ పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ నా రేంజ్‌ను మించి ఉంది. అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను’ అని పేర్కొన్నారు.

సినిమా వివరాలు
తారాగణం: స‌మంత అక్కి‌నేని, దేవ్ మోహ‌న్ తదితరులు
సినిమాటోగ్రాఫ‌ర్‌: శేఖ‌ర్ వి జోసెఫ్‌,
సంగీతం: మ‌ణిశ‌ర్మ,
ఆర్ట్ డైరెక్టర్‌: అశోక్ కుమార్‌,
ఎడిట‌ర్‌: ప్రవీణ్ పూడి,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా,
డైలాగ్స్‌: సాయి మాధ‌వ్ బుర్రా,
లిరిక్స్‌: చైత‌న్య ప్రసాద్‌, శ్రీ‌మ‌ణి,
కొరియోగ్రాఫ‌ర్‌: రాజు సుంద‌రం, పీఆర్వో: బి.ఎ.రాజు,
స‌మ‌ర్ఫణ‌: దిల్‌రాజు,
నిర్మాత‌: నీలిమ గుణ‌,
ర‌చ‌న‌- ద‌ర్శక‌త్వం: గుణ‌శేఖ‌ర్‌.

Share This Article