దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ బృందం’ రెండో రోజే రూ.23 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కొత్త బాటలు వేసింది. స్టీల్, క్లీన్ ఎనర్జీ, బ్యూటీ-టెక్, విమానాల నిర్వహణ, ఏఐ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.

రూ.12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ ప్లాంట్
డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో రూ.12,500 కోట్ల పెట్టుబడితో భారీ స్టీల్ తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలగనుంది. రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్కుమార్ పట్వారిలతో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ‘‘తయారీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్టీల్ ప్లాంట్కు అవసరమైన మౌలిక సదుపాయాలు, బొగ్గు సరఫరా లింకేజీలు అందిస్తాం’’ అని హామీ ఇచ్చారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ రంగాల్లోనూ భాగస్వామ్యం కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
రూ.6,000 కోట్ల న్యూక్లర్ విద్యుత్ ప్రాజెక్ట్
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. స్లోవాకియాకు చెందిన ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ రూ.6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం స్వచ్ఛ శక్తి రంగంలో దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని సాధించడమే తెలంగాణ ప్రధాన దిశగా సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లో లోరియల్ తొలి బ్యూటీ-టెక్ జీసీసీ
సౌందర్య రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ లోరియల్ హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రూ.3,500 కోట్ల పెట్టుబడితో 2030 నాటికి ఈ హబ్ను గ్లోబల్ పవర్హౌస్గా తీర్చిదిద్దనుంది. ఈ కేంద్రం ద్వారా 2,000కిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఏఐ, డేటా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ప్రతిభకు ఇది అంతర్జాతీయ గుర్తింపుగా నిలవనుంది.
రూ.1,000 కోట్లతో విమానాల మరమ్మతు కేంద్రం
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ ‘సర్గాడ్’ తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతు, పునరుద్ధరణ కేంద్రం (MRO) నెలకొల్పేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. వచ్చే 3–5 సంవత్సరాల్లో దశలవారీగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కొత్త విమానాశ్రయాల నేపథ్యంలో, ఈ కేంద్రం తెలంగాణను విమానయాన రంగంలో కీలక హబ్గా మార్చనుంది.
ఏబీ ఇన్బెవ్ విస్తరణ
ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థ ఏబీ ఇన్బెవ్ తెలంగాణలో ఇప్పటికే ఉన్న రెండు తయారీ యూనిట్లను విస్తరించేందుకు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు, రాష్ట్ర ఆదాయం పెరగనుంది.
ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త దిశ
కాలిఫోర్నియాకు చెందిన ‘బ్లైజ్’ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తక్కువ శక్తితో పనిచేసే ఏఐ హార్డ్వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో బ్లైజ్ ముందుంది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఆర్అండ్డీ కేంద్రాన్ని విస్తరించడంతో పాటు, హెల్త్కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టనుంది.
తెలంగాణ రైజింగ్ – గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా రాష్ట్రం
ఈ పెట్టుబడులతో తెలంగాణ స్టీల్, క్లీన్ ఎనర్జీ, బ్యూటీ-టెక్, ఏఐ, విమానయాన, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో దేశానికే నాయకత్వం వహించే స్థాయికి చేరుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దావోస్ సదస్సు ముగిసేలోపు మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదిరే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు.
పెట్టుబడులకు, ఇన్నోవేషన్కు, భవిష్యత్ పరిశ్రమలకు ఇదే సరైన గమ్యం అని దావోస్ వేదికగా తెలంగాణ మరోసారి నిరూపించింది.
