ఆత్మహత్య చేసుకుందామనుకుని.. కోటీశ్వరుడయ్యాడు

Telugu Box Office

జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ అపార్ట్‌మెంట్ భవనం ఎక్కాడు. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే. అతడే అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేవుడు జీవితం ఇచ్చింది జీవించడానికే అని గ్రహించి తన ఎదుగుదలకు కృషి చేశాడు. ఎన్నో స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. ఇది వినడానికి సినిమా స్టోరీలా అనిపించొచ్చు. కానీ సినిమాను తలదన్నే ఎన్నో ఎత్తుపల్లాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయనెవరో కాదు.. విఠల్ వెంకటేష్ కామత్. దేశవిదేశాల్లో ప్రఖ్యాతి చెందిన కామత్ హోటళ్లకు ఆయనే అధినేత.

భార‌తీయ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన కామ‌త్ ఇపుడు ప్రపంచం గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపిస్తోంది. హోటల్స్ ద్వారా రోజూ కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది.

డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్ కు 68 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ గా..మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కామ‌త్ హోట‌ల్స్ గ్రూపున‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇండియాలో ఎన్నో హోట‌ల్స్ త‌మ‌కు పోటీగా ఉన్నా ..కామ‌త్ మాత్రం త‌న స్థానాన్ని కోల్పోలేదు. ముంబై కేంద్రంగా న‌డుస్తున్న ఈ సంస్థను ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేశారు కామ‌త్. 169 కోట్ల ఆదాయం కేవ‌లం ఈ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతోంది. చేతిలో చిల్లి గ‌వ్వ లేని పరిస్థితిలో భార్య పుస్తెల‌తాడును అమ్మి హోటల్ వ్యాపారం ప్రారంభించిన కామ‌త్.. ఇవాళ గ్రూపును ప్రపంచంలోనే టాప్-10లో నిలబెట్టారు.

ఎంద‌రో భార‌తీయులు ..ఎన్నో విజ‌యాలు సొంతం చేసుకున్నారు. కానీ విఠ‌ల్ కామ‌త్‌‌ కథ మాత్రం ప్రత్యేక‌మైనది. ఇది మ‌న‌క‌ళ్ల ముందే జ‌రిగిన కథ‌. విఠ‌ల్ కామ‌త్ హోట‌ల్స్ య‌జ‌మానే కాకుండా మెంటార్‌, ఎంట్రప్రెన్యూర్‌, ట్రైన‌ర్, స‌క్సెస్ ఫుల్ బిజినెస్‌మెన్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. తొలినాళ్లలో ఒక్క గ‌దిలోనే సర్దుకుపోయి కష్టాలు పడి కామత్ ఇప్పుడు వేల కోట్ల విలువ కలిగే ఎన్నో భవనాలు కలిగి ఉన్నారు. ఎంత పైకెదిగినా ఆయన తన మూలాలు మరిచిపోలేదు. కామ‌త్ కుటుంబంలో ఎనిమిది మంది ఉండేవారు. తల్లిదండ్రులు, ముగ్గురు అన్నద‌మ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీళ్లంతా ఒకే గదిలో నివసంచేవారు. ఆ జ్ఞాప‌కాలు ఇప్పటికీ త‌న‌ను హెచ్చరిస్తూనే ఉంటాయని చెబుతుంటారు కామ‌త్.

‘సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. లేకపోతే లావైపోతాం’ అనే టైప్ కామత్. అందుకే ఆయన తన గ్రూపు ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 60లక్షల మొక్కలు నాటించారు. అటవీ సంరక్షణ కోసం 100 ఎకరాల కొండను ఔషధ మొక్కలుగా, చెట్లుగా మార్చారు. ముంబైలో మొట్టమొదటి సీతాకోకచిలుక ఉద్యానవనం, నవీ ముంబై అంతటా తోటలను నిర్మించిన ఘనత కూడా ఆయనదే. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన విఠ‌ల్ కామ‌త్ తన విజయాలను కోట్లాది మంది భార‌తీయుల‌కే కాదు ప్రపంచానికి కూడా ఒక పాఠంగా చూపించారు.

Share This Article