కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా…

Telugu Box Office

ఈ ఏడాది చిట్టచివరి గ్రహణం నవంబరు 8న గురువారం కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది. ఇది చంద్రగ్రహణం కాగా.. ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండో చంద్రగ్రహణం. దీపావళి మర్నాడు సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే ఈ గ్రహణం ఏర్పడుతుండటం విశేషం. అంతేకాదు, ఈ ఏడాది ఏర్పడిన నాలుగు గ్రహణాలు రెండు వారాల వ్యవధిలోనే రావడం చెప్పుకోదగ్గ అంశం. రెండో చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మూడేళ్ల తర్వాత 2025 మార్చి 14న ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

నవంబర్ 8, 2022న చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి ఎరుపు రంగులోకి మారతాడు.. దాదాపు 3 సంవత్సరాల తర్వాతే ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం నవంబరు 8న వివిధ ప్రాంతాల్లో స్థానిక కాలమానం ప్రకారం కనువిందు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు వరకూ కొనసాగుతోంది. భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకూ 45 నిమిషాల 48 సెకెన్లు దర్శనమివ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.46 గంటలకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది. ఇలా 5.11 గంటల వరకూ సాగుతుంది. అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:19 గంటలకు గ్రహణం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉంది. భూమి నీడ లోపల చంద్రుని భాగం భూమి వాతావరణం ద్వారా వక్రీభవన సూర్యకాంతి, ఎర్రటి రంగు ద్వారా మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంత సుదీర్ఘకాల చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చు. ఎటువంటి పరికరాలు అవసరం లేదని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన చంద్రుడ్ని చూడొచ్చు.

Share This Article