దక్షిణాదిలో ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయాలివే

Telugu Box Office

శ్రీ కృష్ణుని ఆరాధన కేవలం హిందూమతం, భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు.. విదేశాల్లో శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు, అంగరంగ వైభవంగా వేడుకలు కూడా నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమి రోజున భారతదేశంలోని ప్రముఖ కృష్ణ దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే శ్రీకృష్ణుని జన్మభూమి అంటే మాత్రం చాలా మధుర, గోకుల బృందావన ఆలయాలనే భావిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో కూడా ప్రముఖ వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణుడి, వేణు గోపాల స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చారిత్రక ప్రాధాన్యం ఉండే గుళ్లు ఎన్నో ఉన్నాయి. వీలైతే వీటిని ఓసారి సందర్శిచేయండి.

శ్రీకృష్ణ మఠం, ఉడిపి

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శ్రీ కృష్ణుని ఆలయాల్లో ఉడుపి శ్రీకృష్ణ మఠం ఒకటి. ఇది కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కేంద్రంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న వేణు మాధవుడిని నవ రంధ్రాల కిటికీ నుండి మాత్రమే పూజిస్తారు. భక్తులకు కిటికీ నుండి మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఈ ఆలయం చెక్క మరియు రాతితో నిర్మించబడిందది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులోని నీటిలో గుడి గోపురానికి సంబంధించిన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

​గురువాయుర్ దేవాలయం, కేరళ

దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ అనేక ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గురువాయుర్ దేవాలయం. దీన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇది విష్ణువు యొక్క పవిత్ర నివాసంగా భావిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో వరదలు వచ్చినప్పుడు కృష్ణుడి విగ్రహం కొట్టుకుపోయిందని, దాన్ని గురువు రక్షించాడని చాలా మంది నమ్ముతారు. ఈ విగ్రహాన్ని కేరళలో గురు దేవుడు వాయు దేవుని సహాయంతో ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే కేరళలోని శ్రీ కృష్ణ దేవాలయం గురువు, వాయు దేవుని పేరు మీదుగా గురువాయుర్ ఆలయంగా మారిపోయింది.

తిరుపతిలో

కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని సన్నిధానంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉట్ల ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తిరుపతికి తరలివస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున కన్నయ్య కోవెలల్లో ఘనంగా జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొట్టడం, గ్రామోత్సవం వంటి సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

​నాంపల్లి ఇస్కాన్ టెంపుల్

భాగ్యనగరం నడిబొడ్డున ప్రముఖ శ్రీ కృష్ణుని దేవాలయం ఉంది. నాంపల్లిలో ఉన్న ఈ దేవాలయం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు చేరువలో కూడా కృష్ణుడి పురాతన దేవాలయం ఉంది. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించినది. ఈ గుడితో పాటు భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

​మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో హంసలదీవి, మొవ్వలోని వేణుగోపాల స్వామి ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హంసలదీవిలోని కృష్ణుని గుడికి వేయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యభామలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూచిపూడి సమీపంలోని మొవ్వ క్షేత్రంలోనూ శ్రీకృష్ణుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ కన్నయ్య చేతిలోని వేణువులో గాలి ఊదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు స్వామి వారికి సంబంధించిన మకరతోరణంలో దశావతరాలు కనిపిస్తాయి. క్షేత్రయ్య రాసిన పదాలన్నీ శ్రీకృష్ణుడిపైనే. ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

​పార్థసారథి ఆలయం, చెన్నై

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన నాలుగు అవతారాలను పూజిస్తారు. ఇందులో కృష్ణుడు, రాముడు, నరసింహుడు, వరాహావతారాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయంలో అనేక మిస్టరీలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించినదిగా తెలుస్తోంది.

Share This Article