వరలక్ష్మీ వ్రతం రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Telugu Box Office

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, సకల సంపదలతో తులతూగుతామని, మహిళలు ముత్తయిదువులుగా జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు.

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. కోరిన వారందరికీ కోరికలను తీర్చి, అందరిని కటాక్షించి లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పింది. శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ధన, కనక, వస్తు, వాహనాలు సమకూరుతాయి అని వరలక్ష్మీదేవి చారుమతికి వివరించింది. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పింది. అప్పటినుండి చారుమతి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, ఆపై వివాహిత మహిళలు అందరూ ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు.

శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం అందరూ చేసుకుంటారు. రెండో శుక్రవారం ఆచరించడానికి మహిళలకు వీలుకాకపోతే, ఆ తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజ భక్తిభావంతో, అత్యంత నియమ నిష్టలతో చేయాలి. వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. దీంతో వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చెయ్యకూడని పొరపాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చేయకూడని తప్పులివే…

వరలక్ష్మీ వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి ప్లేట్ లో కానీ, రాగి ప్లేట్లలో కానీ కలశాలను ఏర్పాటు చేసుకోవాలి.

వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేసినా ముందు పూజించవలసినది ఆది గణపతినే. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు.

వరలక్ష్మీ వ్రతం నాడు ఇంట్లో అందరి సహకారం లేకపోతే అది దోషం. వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్న ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ పూజలో భాగస్వాములు కావాలి. అందరూ అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇంట్లో మహిళలు చేసుకుంటున్నారు. మాకేం సంబంధం లేదు అన్నట్టు ఏ ఒక్కరు ఉండకూడదని పెద్దలు చెబుతున్నారు.

శక్తి కొలది, భక్తితో అమ్మవారికి పూజ చేసి, నివేదన చేయాలని, మనసులో భక్తి లేకుండా ఫార్మాలిటీగా పూజలు చేయకూడదని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నాను కాబట్టి తప్పదు అన్న చందంగా ఎవరు అమ్మవారిని పూజించకూడదు.

Share This Article