హరిహరసుతుడు అయ్యప్ప… శబరిమల యాత్ర విశేషాలు

Telugu Box Office

కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిల‌వ‌డం… ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది.

శబరిమల క్షేత్రం..
కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొనివుంది. అక్కడ వేంచేసి ఉన్న అయ్యప్పస్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమాసం (నవంబరు-డిసెంబరు)లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కార్తీకం ముందు నుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది. నల్లని దుస్తులు ధ‌రించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ. వారు సాగించే దీక్షలోని నియమాలు సామాన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ ‘స్వామి’గా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు బయలుదేరుతారు. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు… తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి మాలధారుల శిరస్సున ఉంచుతారు.

చిన్నపాదం.. పెద్దపాదం
ఇరుముడి తలదాల్చిన భక్త బృందం ఎరుమేలి నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఎరుమేలే. హైందవ ధర్మానుసారం దీక్షచేసిన భ‌క్తులు తొలుత ఇక్కడి వావర్‌ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంలోనే రంగులు జల్లుకొని వాద్య బృందాలు తోడు రాగా ‘పేటతుల్లాల్‌’ను నిర్వహిస్తారు. పిదప ఎరుమేలిలోని ధర్మశాస్తకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరే పెద్దపాదం, చిన్నపాదం అనే మార్గాలు ఉన్నాయి. చిన్నపాదం అంటే ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి అక్కడ స్నానం చేసి నీలిమలను అధిరోహిస్తారు.

పెద్దపాదం అంటే ఎరుమేలి నుంచే నడుస్తూ దాదాపు 80 కిలోమీటర్లు నడిచి కొండకు చేరడం! ఈ వనయాత్ర చేసే భక్తులు మొదట ‘పెరుర్‌తోడు’కు వెళ్లి స్నానాదికాలు ముగించి అక్కడి దేవుణ్ని పూజిస్తారు. తరవాత కాలైకట్టి అనే ప్రాంతానికి వెళ్తారు. పిదప అళుదా నదీ తీరానికి వెళ్లి పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నదీ ప్రవాహానికి కారణమైన గాథను గురుస్వాములు తప్పనిసరిగా చెబుతారు. అయ్యప్ప చంపిన మహిషి కార్చిన కన్నీరే నదిగా మారిందని అంటారు. ఇక్కడ చిన్నరాయిని తీసుకొని అళుదామేడు దాటి ఇంజిపరైకోటై చేరుకొంటారు. కళిడం కుండ్రు అనే ప్రదేశంలో ఈ రాయిని వేస్తారు. కరిమల యాత్రకు శ్రీకారం చుడుతారు. పెరియనపట్టం, చెరియ‌న‌ప‌ట్టం మీదుగా పంపకు (దీనినే పంబ అని వ్యవహరిస్తారు) చేర‌తారు.. ఈ వనయాత్రలోనే కొందరు భక్తులు శక్తిపూజ చేసి అన్నదానం చేస్తుంటారు.

పంపానదిలో స్నానం..
పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు టెంకాయలు కొడుతారు. ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.

200 ఏళ్ల క్రితమే..
పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం 7రూపాయలు వచ్చిందని పందళరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి వుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో ఆలయాన్ని పునర్నిర్మించారు

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దేవస్థానం బోర్డువారికి అప్పగించారు. ఆ తర్వాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంతో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలో కూడా తెరవడం ప్రారంభించారు.

స్వామికి నెయ్యాభిషేకం..
చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో అక్కడి కొండ‌లు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చేయించే ఈ అభిషేకాన్ని ఇలా విశ్లేషిస్తారు. ‘ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ఇందులో ఇమిడివుంది. అలాగే నెయ్యిని తీసుకొచ్చిన కొబ్బరి చిప్పల్ని హోమాగ్నిలో వెయ్యాలి. భక్తుడి కర్మఫలాన్ని ఆ ప్రజ్వలనం ధ్వంసం చేస్తుంది’. తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని , నాగరాజ, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను ఆ గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టే ఆచారం లేదు.! ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘ‌ట్టానికి చేరుతుంది. వేనవేల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి నీలకల్‌ ప్రాంతం వరకు వుంటారు. తిరువాభరణాల వూరేగింపు చూసిన భక్తులు స్వామి శరణాలను వల్లిస్తారు.

ఆంధ్రా నుంచి తాంత్రిలు..
1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపై నుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985లో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభమైంది. బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి ముందుకురావడంతో 2000లో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది. శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశం అయిన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్ళారని చెబుతారు.

అయ్యప్ప దీక్షా నియమాలు

అయ్యప్ప మాలధారులు నలుపు, హనుమాన్‌ కాషాయం రంగు వస్త్రాలు ధరించాలి.

  • గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చకస్వామి ద్వారా మాల ధరించాలి.
  • ముందు రోజు మద్యం, మాంసం తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు పూర్తి చేయాలి.
  • స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు పాదరక్షలు వాడకూడదు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో బ్రాహ్మచారిత్వం పాటించాలి. బయటి తినుబండారాలు తినకూడదు.
  • ఉదయం, సాయంత్రం రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి. పగలు బిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్పస్వామికి పూజ చేయాలి.
  • అశుభ కార్యాల్లో పాల్గొనవద్దు. అసవరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయొద్దు.
  • నిదురించేప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్త పడాలి.
  • దీక్షలో ఉండగా రక్తసంబంధీలకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి. నడిచే దారిలో శవం ఎదురైతే, జన సందోహంలో తిరిగినప్పుడు రజస్వల అయితే, బహిష్టు అయిన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణుఘోష చెప్పాలి.
  • స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే బిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి.
  • బిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు.
  • దీక్షా సమయంలో గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు. పగలు నిద్రించకూడదు.
  • ఇంట్లో ఒక వేరు గదిలో ఉండాలి.
  • స్వామికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.

శబరిమల ఇలా చేరుకోవచ్చు…

  • రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్‌ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి కారు లేదా బస్సుల ద్వారా పంప చేరుకోవచ్చు.
  • దేశంలోని అన్ని ప్రాంతాల‌ నుంచి శబరిమలకు రవాణా సౌకర్యం ఉంది.
  • విమానాల ద్వారా వచ్చేవారు కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. అక్కడ నుంచి కాలిన‌డ‌క‌న వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.
Share This Article